Friday 8 November 2013

కలల ఇంటి చిరునామా

” నిను కానక నిముసం మనలేను, నువు కనబడితే నిను కనలేను ” అని చిన్నప్పుడు విన్నప్పుడు ఏ  వైరుధ్యమూ తట్టలేదు. కొన్నేళ్ల తర్వాత ” నాలో నిండిన నీవే నాకుచాలు నేటికి, మోయలేని ఈ హాయిని మోయనీ, ఒక్క క్షణం ” అంటే అర్థమయినట్లే ఉండేది.


కృష్ణశాస్త్రి గారు విడిగా  కవిగా పరిచయమయేనాటికి పదమూడేళ్లు నిండాయి నాకు. ” కృష్ణపక్షమ్మొకటె నాకు మిగిలె ” …ఈ వాక్యాలు నా లోపలి దేనికో ఆకృతినిచ్చినట్లు అనిపించింది , ప్రాణస్నేహితురాలిని వదిలి ఉండటం అనే తీవ్రమైన దుఃఖం లో ఉన్నప్పుడు .అది  ఇప్పుడు తలచుకున్నా అవమానంగా ఏమీ అనిపించదు. ఆత్మీయులకి దూరం కావటం కంటె శోకమన్నది లేదని ఈ నాటికీ తోస్తుంది, విధి అనుమతించినన్నాళ్లూ  అహర్నిశలూ చూస్తూ ఉండగలగటం కన్న కోరుకోవలసిన ఆనందమేమీ  లేదు, ఎప్పటికీ.
ఈ మధ్య బుజ్జాయి  గారు రాసిన ‘ నాన్న-నేను ‘ చదివాక కృష్ణశాస్త్రి గారి దృక్పథం తెలిసింది.
” నావలె అతడున్మత్త భావమయశాలి, ఆగికోలేడు రేగు ఊహలనొకింత ! ఇంత చిరు గీతి ఎద వేగిరించునేని పాడుకొనును, తాండవనృత్యమాడుకొనును ”  ఈ మాటలు ఇంచుమించు మూడు దశాబ్దాలు నా జీవితపు టాగ్ లైన్ లు గా ఉండేవి. ఆ రెపరెపలాడిపోయేతనమే నడుపుతూ ఉండేది నన్ను, అలా గాలికి కొట్టుకుపోతూనే  ఉండేదాన్ని.నేల మీద నిలిపేందుకూ  వేరే రచయితలు  ప్రయత్నిస్తూ  ఉండేవారు, కాని  కాలు నిలిస్తేనా !
శాపగ్రస్తులమయి ఈ ప్రపంచంలోకి రావలసి వచ్చిందని అనుకోని మనో జీవులు  ఉంటారా ?   దిగిరావటం దిగిపోవటమేననే ఊహాపోహల కాలమది.
పదిహేడేళ్లు వచ్చేనాటికి అమృతవీణ, మంగళ కాహళి, వ్యాసాల సంపుటులు నాలుగూ విడుదలయాయి. ఆ వచనం ఎంత మార్దవంగా,  రుచిరార్థ  సమ్మితంగా ఉండేదని ! శ్రీశ్రీ గారు రాసిన వ్యాఖ్యానంతో వచ్చాయి అవి. ” ఇక్షుసముద్రం ఎక్కడుందో చూశారా  ” అని మొదలవుతుంది అది. ఆస్వాదానికి ఆహ్వానంతోబాటు చిన్న అవమానమూ ఉంది అక్కడ ” ఇంకా మీరు కోరుకునే ఎన్నో మసాలాలున్నాయి ” అనే మాటల వెనక. అది శ్రీ  శ్రీ ఉద్దేశించారో లేదో నాకు తెలియదు. కృష్ణశాస్త్రి గారి కవిత్వపు, సామీప్యపు ఇంద్రజాలానికి బలంగా లోనయి బయటపడినవారిలో శ్రీ శ్రీ ఒకరని అప్పటికి తెలియదు.
కవితాప్రశస్తి  వ్యాసాలలో ‘ కరుణ ‘ అనేది చాలా కాలం ఊపివేసేది. దుఃఖించేవాడి  గురించి ” అతను తెలిసిపోతాడు , అతని దగ్గర చెప్పులు వదలి తల దించుకుంటాము ” అంటారు. అంతకన్న చెప్పవలసినది లేదు.లిరిక్  శిల్పం అనే వ్యాసమూ నాకు చాలా ఇష్టం. మంత్రపుగవాక్షాల  గురించీ, ప్రమాదభరిత సాగరాల గురించీ కీట్స్ కవితా పంక్తుల  పరిచయం అక్కడే .
కవి పరంపర అనే వ్యాసాల వరసలో ” నా కంటికి తిక్కన్న గారు పొడుగ్గా ఉంటా డు ‘ లాంటి వాక్యాలతో పదచిత్రాలతో ఆయా కవుల రూపురేఖా విలాసాలని బొమ్మ కట్టిచూపటం విపరీతంగా ఆకర్షించేది . మృత్యువు కన్నా నల్లని అన్యాయాలను సహించటం  ” అని మొదలయే గీతం గా నన్ను పరిపాలించింది అప్పటిలో.
 మహావ్యక్తులు సంపుటం లో చిత్త రంజన్   దాస్ గారి గురించిన వ్యాసం బలంగా  ఉంటుంది.ఆయన రచన కి  బహుశా కృష్ణశాస్త్రి గారే చేసిన అనువాదం ” ఆశకు కూడా అతీతమయిన కష్టాలు  పడటం, రాతిరి కన్నా
మన నాయనమ్మ కంటే కొన్నిసార్లు మనకి గాంధారి ఎంత బాగా తెలుస్తుందో చెబుతారు ఇంకొక చోట, ఇతిహాసాల గురించిన  ప్రస్తావనలో.
పొద్దున్నే లేవలేని నా బద్ధకానికీ పద్యం ఎప్పటికీ సమర్థింపు
” తల్లిరేయి, ఆమె చల్లని యొడిపైని నిదురపొమ్ము
నిదుర నిదుర కొక్క కల వెలుంగు పసిడి జలతారు  అంచురా
మేలుకొనకు కల వేళ, తండ్రి ! ”
అమృతవీణ దినదినాహారం అప్పుడు. గుంటూరు లో అరుదుగా దొరికే సిం హాచలం  సంపంగి పూరేక్కలు దాచుకున్నాను ఆ పుటలలో, ఉన్నాయి ఇంకా. ప్రేమ లోని, అర్పణ లోని ఎన్ని మన స్స్థితులను  చెప్పారో ఆయన అందులో. ” చిన్ని పూవు పదములపై ఒకటే, కన్నీటి చుక్కలాపై రెండే ” అనే ఏకాంత దర్శనం ఒకసారి, ” తెలివిమాలి నా హృదయపు తలుపు మూసి ఉన్నఫ్ఫుడు తొలగదోసి ద్వారము , లోపలికి రావలయు ప్రభూ, మరలి వెడలిపోకుమా” అని ఏమరపాటు ని  ఎలాగ  పట్టించుకోరాదో ఇంకొకసారి, ” మాట తీసుకొని నాకు మౌనమొసగినావు, మౌనమందుకొని నీకు గానమీయమంటావు! నా కంఠము చీకటైన ఈ కృష్ణ రజని తుదిని నాకయి నీ చెయి సాచిన నా కానుక ఇంతే కద, ఈ కొంచెపు పాటే కద ” అనే నిష్టూరపు ఒప్పుదల మరి ఒకసారి.
ఆ రోజులలోనే మొదటిసారి మల్లీశ్వరి  చూడగలిగాను. ఏమో, అందరూ ఏమేమి అంటారో నాకు తెలియదు, అది కృష్ణశాస్త్రి గారి కృతి నాకు, అంతే… కనీసం ప్రధానంగా.నల్ల కనుల నాగస్వరం మోగుతూనే ఉంది…. వెండివెన్నెల గొలుసులకు వ్రేలాడిన రేయి ఊయల ఊగుతూనే ఉంది….
స్వాప్నికలోకానికి ఈవల ఎన్నో జరిగితీరుతాయి తప్పదు, నాకూనూ. ఆ   గాటంపుకౌగిలి వదలి కనులు వేరేలా తెరచిచూడవలసిందే. నా లోపలి నన్ను పదిలపరచుకుంది వారివలన. వారే చెప్పిన మాటలు … అవకాశం దొరుకుతూనే పిల్లలని వినమనే మాటలు, జీవనసంరంభం  నడిమధ్యని నిలవలేవు,  దూరమయి నిభాయించుకోలేవు , అందుకే
” లోకానికి పొలిమేరన నీ లోకం నిలుపుకో ! ”

                               [సారంగ లో వచ్చిన వ్యాసం ] 


Tuesday 5 November 2013

పున్నాగ

కార్తీకమాసమూ పున్నాగపూలూ కలిసి ఇంటికొస్తాయి ప్రతి ఏడూ. ఈ పూలతో ఎన్ని పెనవేతలు ఉన్నాయో ! గుంటూరు నుంచి రేపల్లె వెళ్లే దారిలో పిట్టలవానిపాలెం అనే అందమయిన ఊరు ఉంది, వెలిగిపోయే ఆకుపచ్చ రంగులలో వేసిన బొమ్మ. ఒక నవంబర్ లో కొన్ని రోజులు అక్కడ గడిచాయి,
 కాలదేశపు రాకుమార్తె గుప్పెడు శాంతిని పిడికెడు  చలితో తో కలిపి అద్దుకునే ఋతువు అది. ఎంత కాగే మనసు అయినా కాస్త శమించి ఆగే సమయం
  .కొన్ని పూలు పొద్దున్నే విచ్చుతాయి, కొన్ని రాత్రికి. ఇవి ' పొద్దెక్కి ' విరిసే పూలు. వీటి వైభవం అప్పుడు మొదలయి రాత్రి సగం గడిచేదాకా. మధ్యాహ్నపు కునుకు తీసే కాలువ మీదికి నవ్వే పూవులు. గోరు వెచ్చని చిట్టి ఎండని ముద్దు చేస్తూ రాలే పూవులు. వెన్నెట్లో రాత్రి వేళ చుక్కల్లా ఊగే పూవులు.
    అప్పుడుండే ఇంటి ముంగిట నాటుకున్నామొక  మొక్కని, అమరావతి గుడి తోట లో అడిగి తెచ్చుకున్నాము..,ఎదిగి వృక్షమై ఏటేటా ఉత్సవాలు చేస్తుంటే చూసుకున్నాము, తప్పనిసరయి వదలి వచ్చాము.
 కొన్ని యేళ్ల వియోగం అంతమై ఇంకో రెండు మొక్కలు పెంచాము. చుట్టూ దడి కట్టాము, కాపాడాము, గోదావరి మట్టిసారం సాంద్ర సురభిళ పరిమళమైంది.
    రెండు చెట్లూ రెండు పూల మేడలు గాలిలో. ఒకతుఫాను  ఉదుటుకి ఒకటి కూలిపోయింది. ఏడ్చి ఊరుకోవటం కాదు, మోకులు కట్టి లేపాము. ఆశ వృధా అయిపోలేదు, ఆరుబయటి ఆలయం లో పూజ ఆగి పోలేదు.

[కర్టసీ..స్వాప్నిక్ చీమలమర్రి ]

ఒక రచన ని ఇష్టపడటం కనీసం నాలుగు స్థాయిలలో ఉంటుంది... 1.బాగుంది 2.నచ్చింది 3.నా లోపలికి వెళ్లింది 4.నా ఆలోచన లోనూ జీవనవిధానం లోనూ ప్రతిఫలిస్తోంది.

ఇ.గాయత్రి

ఇ.గాయత్రి గారు సరదాగా సినిమా పాటలు వీణ మీద పలికిస్తారు.ఆ సరదా గొప్ప వరం ఓల్డీస్ ప్రియులకి.' మనసు పరిమళించెనే ' అనే ఆల్బం లో మనం ఇష్టంగా వినే తీయటి పాత పాటలు ఉన్నాయి.మొదటి పాట ' విన్నానులె ప్రియా '.ఒకరి మనసు ఒకరు ' ' కనుగొన్నప్పటి ' పట్టలేనంత ఆనందం ఉత్సవంలా వినిపిస్తుంది నాకు ఈ పాటలో. దీనికి తెలుగులో సంగీతం పెండ్యాల గారయినా మూలం ఎం.ఎస్.విశ్వనాథన్ గారిది.కొన్ని మార్పులు చేశారు పెండ్యాల గారు.ఒరిజినల్ కూడా వేరేగా ఎం.ఎస్. వి మెలొడీస్ అని వాయించారు గాయత్రి గారు.ఈ తెలుగు పాటల ఆల్బం లో ఉన్నవన్నీ ముత్యాలూ పగడాలూ.' తపము ఫలించిన శుభవేళా ','నిన్న కనిపించింది ' ,'ఖుషీ ఖుషీగా నవ్వుతూ ','మనసు పరిమళించెనే ',' ప్రేమయాత్రలకు '.గాయత్రి గారి వీణ గొంతుతో పాడినట్లే ఉండటం చిత్రం.'ఒంటరొంటరిగ పోయేదానా ' పాటలో 'ఓ..నానా ' అనటంలో నాజూకు ఎంత శ్రావ్యంగా ఉంటుందో. 'నిలువుమా నీలవేణీ ' వాయించిన తీరు అద్భుతం.నాకు సినిమాలో దాని కంటే ఇదే బావుంటుంది.ఆ లింక్ విడిగా ఇస్తున్నాను.అక్కడ కన్నక్కుడి గారి  ఇంకొన్ని మెలొడీ లు బోనస్ గా ఉన్నాయి.' చిన్నారి పొన్నారి పూవు ' మృదువు గా వినిపిస్తుంది వయొలిన్ మీద.గాయత్రి గారుమీటినవి   ఇంకా ఉన్నాయి ఇందులో.. 'పాడవేల రాధికా ',' ఓహో మేఘమాలా ','చేయి చేయి కలుపరావె '...అన్నీ తప్పకుండా వినండి తీరిక చేసుకుని. http://m.bindassfm.com/album.php?id=igk http://gaana.com/song/old-is-gold-manasu-parimalinchane-ntr-and-anr-film-tunes/niluvuma-niluvuma-amarasilpi-jakkanna-76434E Gayathri Manasu Parimalinchene E Gayatri Hits Telugu Songs m.bindassfm.comFree Manasu Parimalinchene E Gayatri Hits Music, Albums, E Gayathri

fragrance

సువాసన పిలుపు వంటిది,పదిమందినాకర్షిస్తుంది. సౌరభం పక్షి వంటిది,దిక్కుదిక్కులా గాలిమీద పరుగెత్తుతుంది సుగంధం స్మృతి వంటిది,పదే పదే స్ఫురిస్తుంది పరిమళం పట్టుకుని విడవని బలవంతపు బంధువు కాదు,తరిచూచి దరియవచ్చే నేస్తం. ఆమోదానికి స్వార్థం లేదు,కలిసిగట్టుదనం ఎక్కువ-అందరికీ అనుభవం పంచి పెడుతుంది. -దేవులపల్లి కృష్ణ శాస్త్రి

కాదంబరి

' మహాశ్వేతల్లే ఉన్నావే మా తల్లీ ' అని మల్లాది రామకృష్ణశాస్త్రిగారి కృష్ణాతీరంలో చదివి ఎవరీవిడ? అనుకున్నాను.ఏ పుస్తకంలో ఉందో మాత్రమే తెలిసింది.[ఇన్ని యేళ్లూ నన్ను వెంటాడుతూనే ఉంది కథ రాసేవరకూ ] సంస్కృతం రాదు,ఇంగ్లీష్ అనువాదాలు అందుబాటులో లేవు. వేరే తెలుగు కావ్యాలు చదువుకోవాలంటే పద్యాన్ని అర్థం చేసుకోవటం తెలియదు. నా చదువుకునే చదువులో భాష ఒక భాగం కాదు. ఆశ మాత్రం ఉండేది. ఆ 80 ల లో నాకు ఎవరు చెప్పారు? రెంటాల గోపాలకృష్ణ గారి కరుణ ప్రసరించింది తేలికయిన,సమగ్రమయిన తెలుగు వచనం ద్వారా. ఆ పుస్తకాలలో కొన్ని ఇప్పుడు కినిగె లో దొరుకుతున్నాయి. చాలా ఆనందంగా ఉంది.http://kinige.com/kbook.php?id=1867&name=kadambari

పుణ్యనదులు

అడివి బాపిరాజు గారి ' తుఫాను ' నుంచి '' ఒక్కొక్క నది ఒక్కొక్క రీతిగా మనుష్యులను నడుపుతుంది.కృష్ణానది శిల్పుల నది.గోదావరి కవుల నది అన్నారు. పెన్నా తుంగభద్రలు విక్రమజీవనమిస్తాయట.కావేరి గాంధర్వానకు అమృత జీరలు వరమిస్తుందట. గంగానది తపస్వినియట. యమున భక్తిమాల .'' నర్మద గురించి బాపిరాజుగారు చెప్పలేదు...బహుశా నర్మద జ్ఞానుల నది ఏమో.